Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

TG: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ.రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ.రాణి కుముదిని జిల్లా కలెక్టర్ లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను మూడు విడుదలలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని, డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండవ విడత, డిసెంబర్ 17న మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు.

పంచాయతీ ఎన్నికల సంబంధించి గ్రామానికి అప్ డేట్ చేసిన రిజర్వేషన్లు, ఏ విడత పోలింగ్ ఉంటుంది, పోలింగ్ కేంద్రాల జియో లోకేషన్ వివరాలు వెంటనే టి-పోల్ వెబ్ సైట్, యాప్ లో నమోదు చేయాలని అన్నారు. టి-పోల్ వెబ్ సైట్, యాప్ లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులను మూడు రోజులలో పరిష్కరించాలని అన్నారు.

నవంబర్ 23న ఫైనల్ చేసిన ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రకారం పంచాయతీ ఎన్నికల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వెబ్ క్యాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలని , పోలింగ్ కేంద్రాలలో మంచి వెలుతురు, ఫర్నిచర్, పవర్ సరఫరా వంటి ఏర్పాట్లు చేయాలని అన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 27న ఉదయం 10.30 గంటల వరకు విడుదల చేయాలని అన్నారు. నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పంచాయతీ పరిధిలోని ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలని అన్నారు .

నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని అన్నారు.పంచాయతీ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు.

నామినేషన్ల పరిశీలన నవంబర్ 30 న సాయంత్రం 5 గంటల వరకు పూర్తి చేసి చెల్లుబాటైనా నామినేటెడ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అన్నారు. అభ్యర్థుల జాబితా పై అప్పిళ్ళ కోసం డిసెంబర్ 01, సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని, డిసెంబర్ 2 నాడు ఆపిళ్ళ పరిష్కరించాలని, నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 03 మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుందని, అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయాలని తెలిపారు.

నామినేషన్ల స్వీకరణ, పరిశీలన,అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా అవసరమైన మార్గదర్శకాల జిల్లా ఎన్నికల అధికారులు జారీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రింటర్లకు అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయవద్దని ఆదేశాలు జారీ చేయాలని, ఎన్నికల ప్రచారం సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ లకు ఎన్నికల కమిషనర్ సూచించారు. ప్రతి మండలానికి ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం, ఒక ఏ.ఈ.ఓ (సహాయ వ్యయ వివరాల నమోదు అధికారి), ప్రతి జిల్లాకు ఒక స్టాటిక్ సర్వేలెన్స్ బృందం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తప్పనిసరిగా జరిగేలా పర్యవేక్షించాలని అన్నారు.

ప్రతి జిల్లాలో ఎం.సి.ఎం.సి కమిటి, జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా ఎం.సి.ఎం.సి అనుమతి ఉండాలని అన్నారు.ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే నేపద్యంలో రైతులు పంట డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా రశీదు పెట్టుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఎం.సి.సి అమలులో నిర్వహించే తనిఖీల లో నగదు,బంగారం,ఇతర పరికరాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు అందించాలని,సీజ్ చేసిన పరికరాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ఏ అధికారి ముందు హాజరు కావాలని వివరాలు ఆ రసీదు లో ఉండాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలు టి-పోల్ లో అప్ లోడ్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మొదటి విడతగా 5 మండలాలోని గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టీ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు.ఎం.సి.ఎం.సి , మీడియా సెల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

Related News

తాజా వార్తలు