గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం తెలిపారు.మంగళవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంతోపాటు సుందరగిరి,బొమ్మనపల్లి గ్రామ పంచాయతీల వద్ద జరుగుతున్న ఎన్నికల నామినేషన్ సెంటర్లను, పోలింగ్ బూత్ లను కరీంనగర్ సీపీ సందర్శించారు.
ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రతి కదలికపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలన్నారు.గ్రామాల్లో ఎలాంటి అలజడులు లేకుండా పోలీసులు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకునే వారికి స్వేచ్ఛ కల్పించాలన్నారు. శాంతి భద్రతల విషయంలో మండల పరిస్థితిపై ఎస్సైని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సిఐ గడ్డం సదన్ కుమార్,చిగురుమామిడి ఎస్సై రేణికుంట సాయికృష్ణ,తదితరులు ఉన్నారు.

