TG: కరీంనగర్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సామర్థ్యవృద్ధి, డిజిటల్ ఆధునికీకరణ, వ్యాపార అభివృద్ధిపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రధాన శిక్షకులుగా భూసారపు శ్రీనివాస్, గ్లాన్సా సొల్యూషన్స్ సీఈవో నరేశ్, టెక్నాలజీ నిపుణుడు కిరణ్ కుమార్ పాల్గొని ఎఫ్పీవో రిజిస్ట్రేషన్, ఫార్మ్-ఆన్లైన్ వినియోగం, మార్కెట్ లింకేజీ, వ్యాపార అవకాశాల రూపకల్పన, పాక్స్ ప్రాంతీయ వ్యాపార విస్తరణ అవకాశాలపై విపులంగా చర్చించారు. కార్యక్రమానికి జిల్లా సహకార అధికారి రామానుజార్యులు అధ్యక్షత వహించారు.
శిక్షణలో తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్,ఎన్సీడీసీ, నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ జయప్రకాశ్, జిల్లా సహకార శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎఫ్పీవోల కోసం ఎల్ఎంఎస్, ఎంఐఎస్, డిజిటల్ డాక్యుమెంటేషన్, సభ్యుల వ్యవస్థీకరణ, ఫైనాన్షియల్ మానిటరింగ్, పనుల్లో ఆటోమేషన్ వంటి అంశాలను నిపుణులు వివరించారు. ముఖ్యంగా సీబీబీవో అధికారి వెంకటేశ్వర్లు ఎఫ్పీవోల నిర్వహణ, నిధుల వినియోగం, ప్రభుత్వ పథకాల అమలు, మార్కెట్ అనుసంధానం వంటి కీలక అంశాలపై మార్గదర్శకాలు అందించారు.
ఈ కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ జిల్లాలోని పాక్స్, ఎఫ్పీవో లను డిజిటల్గా రూపాంతరం దిశగా ముందుకు తీసుకెళ్లడం తమ లక్ష్యమని తెలిపారు. కేడీసీసీబీ నేతృత్వంలో, నాబార్డ్ ఎన్సీడీసీ, తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ వంటి సంస్థల మద్దతుతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేసి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేయడంలో ఈ శిక్షణ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

