TG: వరంగల్ ( ప్రభాత జాగృతి): పాలకుర్తి మండలంలోని ప్రసిద్ధ సోమేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. గురువారం ఆలయాన్ని సందర్శించిన ఆమె పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్తీక పౌర్ణమి రోజున భక్తుల రద్దీకి తగ్గట్టు సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఆలయ ప్రాంగణంలో 5 హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయడానికి అధికారులు స్థల పరిశీలన చేశారు. అఖండ జ్యోతి నూతన నిర్మాణం, అఖండ జ్యోతికి వెళ్లే మార్గంలో మెట్లు ఏర్పాటు, పంచగూళ్ల ఆలయం దగ్గర నుంచి గుట్టపైకి ఘాట్ రోడ్ నిర్మాణం, కిచెన్ షెడ్ పెండింగ్ పనులను పూర్తి చేయడం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ ప్రత్యేకంగా దీపోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని వెల్లడించారు. ఆలయ పునరుద్ధరణ పనుల్లో భాగంగా పార్కింగ్ స్థలాలు, భక్తుల విశ్రాంతి కేంద్రాలు, త్రాగునీటి సదుపాయాలు, సౌకర్యవంతమైన మార్గాలు, విద్యుత్ వ్యవస్థలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని వారు అధికారులను ఆదేశించారు.. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
కొడకండ్ల మండలానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.5 లక్షల 38 వేల రూపాయల విలువైన సీఎంఆర్ ఎఫ్ చెక్కులను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొడకండ్ల మండల లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం ఇది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి కుటుంబానికి అవసర సమయంలో అండగా నిలబడేలా చర్యలు తీసుకుంటోందన్నారు. సీఎం సూచనల మేరకు, లబ్ధిదారుల దరఖాస్తులను వేగంగా పరిశీలించి, అర్హులైన వారికి చెక్కులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

