TG: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ స్పష్టం చేశారు. సీపీఐ బలోపేతానికి ప్రతి కార్యకర్తా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గడపగడపకు సీపీఐ నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఎర్ర జెండానే పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. కార్యకర్తలు అధైర్య పడొద్దని, పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సోమవారం గన్నేరువరం మండలం హన్మాజీపల్లిలో సీపీఐ మండల కార్యదర్శి చొక్కాల శ్రీశైలం ఆధ్వర్యంలో పార్టీ గ్రామ కార్యదర్శులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని పేర్కొన్నారు గన్నేరువరం మండలంలో అన్ని గ్రామాల్లో కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. కష్టపడేవారికి పార్టీ టికెట్లు వస్తాయని, అభ్యర్థులను కష్టపడి గెలిపించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ప్రతి గ్రామంలో సీపీఐ సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గడప గడపకు సీపీఐని తీసుకెళ్తాం: చొక్కాల శ్రీశైలం
ప్రజా సమస్యలపై పోరాటం చేసేది ఒక్క సీపీఐయ్యేనని ఆ పార్టీ గన్నేరువరం మండల కార్యదర్శి చొక్కాల శ్రీశైలం స్పష్టంచేశారు. ఎర్ర జెండా ప్రజలకు అండ అన్న నినాదంతో ఊరూరా ప్రతి గడపకు పార్టీని చేరవేసి ప్రజలను చైతన్యవంతం చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతనికి కృషి చేసి మండలంలో మెజారిటీ సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ముందుకు పోవాలని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులను గెలిపించుకొనేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల అంజిరెడ్డి, మండల సహాయ కార్యదర్శులు కూన మల్లయ్య, పిప్పల కనుకయ్య, గన్నేరువరం కార్యదర్శి బోయిని మల్లయ్య, గుండ్లపల్లి గ్రామ కార్యదర్శి బోయిని తిరుపతి, జంగపల్లి కార్యదర్శి కోతి సంపత్, కొండాపూర్ కార్యదర్శి కూన కిష్టయ్య, దాసరి చంద్రయ్య, ఎండీ నయీమ్, బొమ్మకంటి అంజయ్యాచారి, రాజమల్లు, సంపత్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

