ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండా సురేందర్ రెడ్డి అనారోగ్యంతో కరీంనగర్ లో మృతి చెందడంతో హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఆయన నివాసంలో ఉంచిన సురేందర్ రెడ్డి మృతదేహానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు.
సురేందర్ రెడ్డి గత 20 సంవత్సరాలకు పైగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ లో పనిచేస్తూ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని, సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం పనిచేశాడని, నిరంతరం రైతులు,కార్మికులు,ప్రజల పక్షాన పోరాడేవాడని,అనేక ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించి ఉద్యమాలలో ముందుండే వాడని, వామపక్షాలు నిర్వహించిన ఉమ్మడి సమావేశాలు, కార్యక్రమాలకు హాజరై వాటిని విజయవంతం చేయడంలో కృషి చేసేవాడని , అలాంటి నాయకుడు గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ మృతి చెందడం అత్యంత బాధాకరమని వారి మరణం పట్ల సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి పక్షాన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నట్టు పంజాల శ్రీనివాస్ తెలిపారు.

