కరీంనగర్:మహిళలు,పిల్లలు,వికలాంగులు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల జిల్లా స్థాయి ఆటల పోటీలు కరీంనగర్ లోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి.జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ కార్యక్రమానికి హాజరై పలు ఆటల పోటీలను ప్రారంభించారు.గెలుపొందిన వారికి మెడల్స్ అందజేశారు.చెస్,క్యారం,రన్నింగ్,షార్ట్ పుట్,జావలిన్ త్రో వంటి పోటీల్లో విభాగాల వారీగా అంధులు,బధిరులు,శారీరక,మానసిక దివ్యాంగులు తమ ప్రతిభను చాటారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగుల మానసిక వికాసానికి ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు.జిల్లా సంక్షేమ అధికారి ఎం సరస్వతి మాట్లాడుతూ వచ్చేనెల మూడవ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఈ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు.ఈ పోటీలలో గెలుపొందిన విజేతలను త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా తరపున పంపించడం జరుగుతుందని తెలిపారు.బాల్య వివాహ్ ముక్త్ భారత్ పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడ శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, లయన్స్ క్లబ్ ప్రతినిధి శివ కాంత్, రెడ్ క్రాస్ సోసైటీ అధ్యక్షులు పెండ్యాల కేశవరెడ్డి, వివిధ సంఘాల ప్రతినిధులు వెన్నం శ్రీనివాస్, మొగిలి లక్ష్మణ్, కె. నర్సయ్య, వై. సురేష్, రాజశేఖర్ రెడ్డి, ప్రభుత్వ అంధుల, బధిరుల, మానసిక పాఠశాలల చిన్నారులు పాల్గొన్నారు.

