TG:రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తుందని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు.సోమవారం పెద్దపల్లి పట్టణంలోని స్వరూప గార్డెన్స్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి,జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.మహిళలకు ఉచితంగా బస్సు రవాణా కల్పిస్తే ప్రతిపక్షాలు తట్టుకోలేక పోతున్నాయని, దీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వీరికి జూబ్లీహిల్స్ మహిళలు కర్రు కాల్చి వాత పెట్టారని మంత్రి తెలిపారు. గత 10 సంవత్సరాల పాలనలో ఎప్పుడైనా వడ్డి లేని రుణాలు అందించాలని ఆలోచన పాలకులకు రాలేదని, మన ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ద్వారా వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో మొదటి ఏడాది వడ్డీ లేని రుణాలు కింద 9 కోట్ల రూపాయలు విడుదల చేసామని, ప్రస్తుత సంవత్సరం మరో 10 కోట్ల రూపాయలు విడుదల చేయబోతున్నామని అన్నారు.
2047 తెలంగాణ రైసింగ్ పాలసీ లో భాగంగా మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ కోటీశ్వరులను చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు.మహిళలకు ప్రత్యేకంగా పారిశ్రామిక వాడలలో భూముల కేటాయింపుకు ఆలోచన చేస్తున్నామని అన్నారు.పేద కుటుంబంలోని మహిళలు ఇబ్బందులు పడవద్దని 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని అన్నారు. ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోనే మహిళలకు సారే అందించాలని లక్ష్యంతో నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. రేషన్ కార్డు లో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు పంపిణీ చేస్తామని అన్నారు. పట్టణ ప్రాంతంలోని మహిళలకు వచ్చే సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ, ఎకరానికి 12,000 పెట్టుబడి సహాయం, సన్న వడ్లకు క్వింటాళ్ల 500 రూపాయల బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల రూపాయల పెంచామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టామని, రాబోయే 2 సంవత్సరాల కాలంలో ప్రతి పాఠశాల రూపురేఖలు పూర్తిస్థాయిలో మారుస్తామని అన్నారు.యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పెద్దపల్లిలో టాస్క్ రీజినల్ సెంటర్ ఏర్పాటు చేశామని అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో సిటి స్కాన్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజల సంక్షేమానికి పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు తమ ఆశీర్వాదం అందించాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ చీరల పంపిణీ మొదటి విడత గ్రామీణ ప్రాంతాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పంపిణీ చేస్తున్నామని అన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాల సిసిలు , విఓ లు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం వేగవంతంగా పూర్తి చేసి చీర అందుకున్న ప్రతి మహిళ ఫోటో యాప్ లో నమోదు చేయాలని అన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొదటి విడత కింద లక్షా 20 వేల ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని అన్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట నాసిరకం చీరలు పంపిణీ చేసి మహిళలను అగౌరవ పరిచారని అన్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి మంచి డిజైన్ తో నాణ్యమైన చీరలను మహిళలకు అందిస్తున్నామని అన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నాణ్యమైన చీరను రేవంతన్న ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. వడ్డీ లేని రుణాలు గత ప్రభుత్వం విస్మరిస్తే మన ప్రజా ప్రభుత్వం పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో మహిళలకు వడ్డి లేని రుణాలు పంపిణీ చేసి 4 కోట్ల 73 లక్షల రూపాయల వడ్డీ డబ్బులు మహిళా బ్యాంక్ ఖాతాలలో జమ చేశామని, ప్రస్తుత సంవత్సరానికి మరో 5 కోట్ల 23 లక్షల పైగా వడ్డీ డబ్బులను కూడా మహిళా సంఘాల ఖాతాలలో జమ చేస్తామని అన్నారు.
మహిళ సంఘాలలోని మహిళలకు ప్రమాద బీమా, జీవిత బీమా కల్పించామని అన్నారు. సహజ మరణం పొందిన 79 మహిళల యొక్క 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేశామని, ప్రమాదవశాత్తు 10 మంది మహిళలు మరణిస్తే 10 లక్షల రూపాయల చోప్పున బీమా సొమ్ము కుటుంబ సభ్యులకు అందించామని తెలిపారు.
పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి బాగు చేయడం వల్ల ఓపి 3 రేట్లు పెరిగిందని, నెలకు 250 పైగా ప్రసవాలు జరుగుతున్నాయని, గర్భిణీ స్త్రీలకు అవసరమైన టిఫా స్కాన్ ఉచితంగా చేస్తున్నామని అన్నారు. ఆర్థోపెడిక్, కంటి శస్త్ర చికిత్సల విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు.
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రతి మహిళ మరో 10 మందికి ఉపాధి అందించే స్థాయికి ఎదిగే దిశగా సహకారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రైతులు, యువత, కార్మికులు, మహిళల సంక్షేమమే అభ్యున్నతిగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
మహిళా సంఘాలకు లక్ష కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తూ చిన్న, కుటీర పరిశ్రమల స్థాపనలో మహిళలు ముందు ఉండేలా చూస్తున్నామని అన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో అద్దెకు ఆర్టిసి బస్సులు , పెట్రోల్ బంక్ ఏర్పాటు , సోలార్ విద్యుత్ ప్లాంట్ల స్థాపన వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఆర్.డి.ఓ.గంగయ్య, గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, తహసిల్దార్,ఎంపిడిఓ,సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

